21 May, 2013

జీవన సంఘర్షన


కధ ప్రారంభించటానికి కాకులు దూరని కారడవి చీమలూ దూరని  చిట్టడవి అంటూ మొదలు పెట్ట నక్కర లేదు. అనగా అనగా ఒక చిన్న వూరు . ఆవూర్లో వంద గడపల సామాన్యులతో పాటు నాలుగైదు సంపన్నుల లోగిళ్ళు ఉన్నాయి.ఆ వూర్లొ ఒక అక్కా ఒక చెల్లి, అక్క బాల వితంతువు చెల్లి నడి వయసు వితంతువు.పిల్ల పీచూ బాదరాబందీ లేదు.ఉన్న చిన్న పొలం మీద ఫలసాయం సంవత్సరానికి  కొంత ధాన్యం వస్తాయి. చిన్నామె భర్త   వదిలి వెళ్ళిన  చిన్న ఇల్లు. వూరి వాళ్ళంతా చింత పడేవారు ఈ ఇద్దరక్కచెల్లెళ్ళు ఎలా బ్రతుకు బండి  లాగించుతారని . భర్త పోయిన నాటినుంచి చెల్లెలు బయటికి వెళ్లేది కాదు.
బ్రతికినంత కాలం బ్రతుకు ని లాగుకునో  నెట్టు  కునో  నడపాల్సిందే!   చిన్నామెకు  దిష్టి మంత్రం ,తేలు మంత్రం  యిరుకు మంత్రం చప్పి మంత్రం  వచ్చు.పల్లెటూరు కావున ఎవరో ఒకరు వస్తారు.. యుక్తిగా తేలు మంత్రం వేయించు కునే టప్పుడు చిన్న పళ్ళెంలో బియ్యం పెసరపప్పు వేసి రూపాయ బిళ్ళ దానిపై ఉంచి తెమ్మనేవారు.మంత్రించిన తరువాత రూపాయి కొంత పప్పు బియ్యం ఉంచుకుని కొద్దిగా పప్పు బియ్యం మిగిల్చి ఒక కొసలొ కొద్దిగా పసుపు కుంకుమ వేసి, తెలు కుట్టిన చోట పసుపు కుంకుమ అద్ద మానేవారు. మిగతా వాటకి కూడా ఏవో తెమ్మనేవారు .
దిష్టి మంత్రానికి పిల్లల్నితేచ్చేటప్పుడు చిన్న గిన్నెలో అయిదు చెంచాల పంచదార తెమ్మనేవారు. అందులోంచి కొంత పంచదార అట్టే పెట్టుకుని మంత్రం వేసేక ఒక చెంచాడు పంచదరగిన్నెలో ఉంచి చిటికెడు పంచదార పిల్లల నోట్లో వేసే వారు.వీటితో వారి దినం తిరుతూందా అంటే తీరదు  కానీ వారి కాఫీ లోకి కొంత పంచదార సరిపోతుంది.ఎవరి పిల్లల్నయినా అతి ముద్దుగా ఆప్యాయంగా పలకరించేవారు.ఆవిధంగా పిల్లలు వారితో పాటు తల్లులు వచ్చేవారు.
ఇక పెద్దామె ఉదయాన్నే ఏడు గంటలవగానే ఒక చిన్నసత్తు గిన్నె కొంగు చాటున పట్టుకుని సంపన్నుల ఇంటికి  వెళ్లి " ఏం చేస్తున్నారు అమ్మడూ ?"అంటు పలకరించేది .ఫ్రిజ్ లు లేని కాలం . కూరల బుట్ట వద్ద కెళ్లి చిందరవందరగా పడి ఉన్న కూరలన్నీ చక్కగా ఏరి ఎండిపోయిన వాటిని వేరు చేసి మంచి వాటిని సర్ది చుట్టూ శుభ్రం చేసి ,"అమ్మడూ !యీ నాలుగూ ఎండి పోయాయి తీసుకు వెళ్ళనా ? నువ్వైనా అవతల వేసేదే కదా ! ఏదో పెద్ద వాళ్ళం కురో పచ్చడో చేసుకుంటాం ,సరేనా అమ్మా!" అన్నాక కాదనడానికి ఇల్లాలికి నోరు రాదు .
అలాగే యింకో యింటికి వెళ్లి కాస్త పని సహాయం చేసి "అమ్మాయ్ కొద్దిగా పుల్ల మజ్జిగ వుంటే పోయ్యమ్మా. చెల్లికి వేడి  చేసింది ."ఉన్నంత లో గిన్నెలో పోసే వారు .తమ అవసరానికి మించి ఏ కాస్త కయినా ఆశ పడేవారు కాదు .
వారి స్వభావాల్ని చూసి వూరి వాళ్ళు ఏదో విధంగా వారికి సహాయం చేద్దామని ,మహాలయ పక్ష మని స్వయం పాకము వాళ్ళు కట్టుకునే తెల్ల చీరలు బెల్లం ముక్క యిచ్చేవారు .కాయ కూర పండు ఎవరు అభిమానం తో ఏమిచ్చినా కాదనకుండా స్వీకరించే వారు .చదువు లేకున్నా వుద్యోగాలు లేకున్నా కేవలం మాట మంచి తనం ,యుక్తి తో జీవిత రధాన్ని నడప వచ్చని రుజువు చేశారు ,ఆ వితంతు సోదరీ మణులు .

పాము భయం


Image
"ఇంటిలొ పాము దూరింది బాబోయ్ సాయానికి రండి,పాము పాము"అంటూ సోమిదేవమ్మ పెట్టిన కేకలు విని, వీధిలో వెళ్తున్నకరీం భాయ్ గోద పక్కనున్న కర్ర చేతిలో తీసుకుని "ఎక్కడ?ఎక్కడ?అంటూయింట్లో కి దూసుకెళ్ళాడు.భయంతో బిక్క చచ్చి గోడకతుక్కుపోయి నోటమాట రాక పాము దూరిన వైపు చేయి చూపింది.పాత కాలం యిల్లు పట్ట పగలైనా వెలుతురు తక్కువగావుండి మసకగా వుంది.
ఏ సామాన్ల సందులో యిరుక్కుందో తెలియదు ఎంత ప్రమాదమైన పామో తెలియదు. ఒక గది లోంచి వేరే గదిలో దూరిందా? వంటింటిలో ప్రవేసించిందా?పాపం ఒక్కామె యింట్లొ వున్నట్ట్లుంది అనుకుంటూ కరీం భాయ్ "లైటు స్విచ్ ఎక్కదమ్మా"అనగానే తన తల దగ్గరున్న స్విచ్ వేసింది సోమిదేవమ్మ.
ఆ గదిలో సామాన్లు ఎక్కువ లేవు దాక్కొనే అవకాశం లేదు, పక్క బెడ్రూములో పెట్టెలు జరిపి మంచం కింద చూశాడు. ఎక్కడా కనిపించ లేదు.ఇక వంటింటిలో దూరి వుంటుందనుకుని అక్కదా వెతకడానికి అడుగు ముందుకు వేశాడో లేదో "ఆ! ఆ! లోపలికెళ్ళకు మడి వస్తువులన్నీ మైల పడిపోతాయి!"
"అయితే పాముతో పాటే వంటిట్లో పని చేసుకుంతారమ్మా?ఒక్కరే వున్నట్లున్నారు విషం పామయితే కుట్టినా ప్రమాదం కదా?మైల పడితే మళ్ళీ మడి చేసుకోండి." అంటూ వినిపించుకోకుండా వంటింట్లో జొరపడ్డాడు కరీం భయ్.చేసేది లేక నిలువు గుడ్లేసుకుని చూస్తుంటే ,"అమ్మా! మీరు మంచం మీద కాళ్ళు పైన ప్ట్టుకుని కూచోండి పాము దొరికాక మిమ్మల్ని పిలుస్తాను ."
"అయ్యో! నన్ను పిలవదమెంసుకు? దాన్ని చంపృయ్ నా కసలే పామంటే చచ్చే భయం."మంచం మీద మఠం వేసుకుని కూర్చుంది సోమిదేవమ్మ .
వంటిల్లా ? అది పెద్ద యుధ్ధరంగంలా వుంది.నీళ్ళ ఎద్దడి నుంచి నాలుగు బిందెల నీళ్ళు పట్టి వున్నాయి.పప్పులు బియ్యం సామాన్లు పోసుకున్న డబ్బాలు లెక్క లేదు."ఎంత మంది వుంటున్నారో మరీ యిన్ని సామాన్లా?"అనుకున్నాడుకరీం భాయ్.ఒక్కొక్క సామాను జరిపుకుంటూ పోతే వంట గట్టు కింద చివర వూరగాయ జాడీలు ఏదెనిమిది వున్నాయి.వాని కదిలించబోతే 'బుస్స్!'మన్న శబ్దం వినిపించింది.
"అమ్మ గారూ! దొరికింది"అన్న మాట వింటూనే ఒక్క అంగలో వంటింట్లోకి వచ్చి "ఎక్కడ?" అంది సోమిదేవమ్మ."యిదిగో యీ వూరగాయ జాదీల వెనుక . '
అయ్యో! అయ్యో! నా మడి ఆవకాయలన్నీ మండిపోయాయి ఈ పాముకేం పోయేకాలమొచ్చిందో నాఅవకాయ జాడీల దగ్గిరేచోటు దొరికిందా?ఏడాదంతా ఎలా గడపాలి? ఆవకాయలేందే ముద్ద దిగదే నా ఖర్మ."
"ఇంతకూ చంపాలా వదిలేయనా వేగంగా చెప్పండి నాకవతల పని వుంది." "బాబ్బాబు చచ్చి నీ కడుపున పుడతాను మా వారు వూరు వెళ్ళారు.అతను వచ్చే దాకా వంటింతిలో పాముతో నేనెలా వుండాలి? చంపేయ్ బాబూ నీకు పుణ్యముంటుంది."
అంతే! మరి ఆలోచించకుండా ,అయితే మీరు బెడ్ రూము తలుపేసుకుని కూర్చోండి రెండు నిముషాల్లో దీని పని పూర్తి చేస్తాను."
అయిదు నిముషాలు క్ష్టపడి జాడీలు జరిపి పాముని చంపాడు కరీం భాయ్.
"అమ్మా పాము చచ్చింది ,బయటికి రండి పెద్దగానే వుంది." అనగానే తలుపు తెరుచుకు ఒక్క ఛెంగులో బయటికి వచ్చింది సోమిదేవమ్మ.
చచ్చిన పాముని చూసి నిశ్చింతగా ఫీలయింది."దాన్ని బయట పారేయ్ నాయనా ఎంతైనా పామనగానే భయపడి మనకి హాని చేస్తుందో లేదో గాని దాని ప్రాణం మనం తీసేస్తాం." కరీం భాయ్ చచ్చిన పాముని దూరంగా పారేసి కర్ర గోడవారగా పెడుతూంటే,సోమిదేవమ్మ యాభయ్ రూపాయలు చేతిలో పెడుతూ "మైల పడ్డవన్నీ పార్వ్సి స్నానం చెయ్యాలి. నీ వుపకారాం మార్చిపోలేను నాయనా."
పై మాట వినగానే"అమ్మా! మీరు పారేయదల్చుకున్నవేమిటో చెప్తే, రిక్షా తెచ్చుకుని నేను పట్టుకెళ్ళి పోతాను.పిల్లలవాడిని మీ పేరు పాము పేరు చెప్పుకుని నాలుగు రోజులు తింటాం.బయట పారేయకండి. అమ్మా!అన్నట్లు కొంత సేపు ముందు చచ్చి నా కడుపున పుడతానన్నారుకదా? నేను ముట్టుకుంటే ఎలా మైల పడ్డాయి?నేను ముట్టుకుంటే మైల పడ్డాయా?పాము ముట్టుకుంటే మైల పడ్డాయా? నేను కాక ఎవరొచ్చినా యివన్నీ తీసి పాముని చంపుతారు."అంటూ ఆమె యిచ్చిన యాభయ్ రూపాయలు తీసుకున్నాడు.
సోమిదేవమ్మకి అర్ధం అయింది ప్రాణ భయం వున్నప్పుడు మాట్లాడిన మాటలు భయం తీరాక వుండవని."ఆగాగు నీ పిల్లల కోసం కాస్త ఆవకాయ పొట్లం కట్టి యిస్తాను.మరెప్పుడూ యిలా మాట్లాడను.యిలాంటి సంఘటనలు నాలుగైదు ఎదురైతే నా ఛాదస్తం తగ్గుతుందేమో."
ఆవకాయ కాస్త పెద్ద పొట్లమే కట్టి యిచ్చింది సోమిదేవమ్మ. సంతోషంగా తీసుకున్నాడు కరీం భాయ్.
మర్నాడు సాయంత్రం భర్త అవధాని వూరినుంచి వచ్చాడు.కాఫీ చేసి గ్లాసుల్లో పోసి వీధి అరుగు మీద కుర్చీల్లో కూర్చుని తీరికగాపాము దూరిన వుదంతం భర్తకి వివరిస్తోందిసోమిదేవమ్మ. ఇంతలో కరీం భాయ్ అటుగా వెళ్తుండటం చూసి "యిదిగో అబ్బాయ్! మాట ఒక్ సారి యిలా రా !"అంటూ సోమిదేవమ్మ పిలిచింది."మళ్ళీ పాము వచ్చిందేమిటమ్మా?పిలుస్తున్నారు.""లేదు నాయనా మా వారు యిప్పుడే వూరినుంచి వచ్చారు. నీ గురించే చెప్తున్నాను,అనుకోకుండా నువ్వు కనిపించావు.నిన్ను మావారికి చూపిద్దామని పిలిచాను.యితడేనండీ నిన్న ఎంతో సాహసంతో పాముని చంపాడు."
చాలా సహాయం చేశావు నాయనా! సమయానికి దేవుళ్ళా వచ్చి మా ఆవిడ భయం పోగొట్టావు ."
'దానిదేముంది బాబూ! ఎవరయినా అంతే చేస్తారు.అన్నట్లు అమ్మగారూ మీ వూరగాయ తిన్నాక తెలిసింది అంత రుచి గల వూరగా తినలేక పోయినా వాసనయినా చూద్దామని వచ్చి వుంటుంది ఆ పాము. పాపం దానికి ఆయువు మూడి పోయింది."
"భలేగా చెప్పావు భాయ్! నీ మేలు మర్చి పోలేము."అన్నాడు అవధాని నవ్వుతూ."వస్తాను బాబూ శలవు" అంటూ నిష్క్రమించాడు కరీం భాయ్.