29 July, 2013

జోగినాధం మాస్టారు

జోగినాధం మాస్టారికి 'బెస్ట్ టీచర్ అవార్డ్ దొరకబోతున్నదన్న వార్త నేను కాలేజీలో చేరిన సంవత్సరం తెలిసింది. ఆ! జోగినాధం మాస్టారికి బెస్ట్ టీచర్ అవార్డా? నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు ఆయన మా క్లాసు టీచర్.
ఆ రోజులు సినీమా రీలులా నా కళ్ళ ముందు మెదిలాయి .వెంటనే అతని రూపం గుర్తుకొచ్చింది.ముతక ఖద్దరు పంచ చొక్కా పై కండువా,కాస్త ఎత్తు పళ్ళు నూని రాసి నున్నగా దువ్విన క్రాఫుకళ్ళజోడు సగం సమయం ముక్కు చివరదాకా జారిపోతూంటుంది. క్లాసులో ప్రవేశించగానే బొంగురు గొంతుతో "యిప్పుడు ఏ పీరియడ్?" అని ప్రశ్నించి క్షణంలో అందరినీ పరికించి చూసేవారు ఎవరు తడబడుతున్నారో కళ్ళజోదులోంచి చూసేవారు.
బోర్డు మీద రాస్తున్నప్పుడు కూడా వెనుకనుంచి మేము ఏం చేస్తున్నామో గమనించేవారు. శిక్షించేటప్పుడు పక్షపాతం లేకుండా అందరికీ ఒకేలా వేసేవారు. అది మాలో కొం దరికి జీర్ణమయ్యేదికాదు.తెలివైన విద్యార్ధులను టీచర్లు కొంత అభిమానంగా చూస్తార, ని పక్షపాతం చూపిస్తారని విన్నాం,గాని మా జోగినాధం మాస్టారి వద్ద అవన్నీ అబధ్ధాలని రుజువైపోయింది.
స్కూలు ఆవరణలో వున్నంతసేపు ఏ క్లాసు కుర్రాడైనా కాగితం ముక్కగాని చెత్త గాని కింద పదేయడం చూస్తే వెంటనే వాడి చెవి పత్తుకుని చెత్త ఏరించి చెత్త కుండీలో వేయించేవారు.'స్కూలమంతా మాస్టారిదేలా ప్రవర్తిస్తారేమిటీ  అనుకునేవాళ్ళం.
ఒక రోజు  టీ చర్స్ కామన్ రూము లోంచి గట్టిగా మాటలు వినిపిస్తూంటే అదీ జోగినాధం మాస్తారి గొంతు వినిపించగానే తొంగి చూశాను ఏమిటా అని.చదివిన పేపరు చక్కగా మడిచి పెట్టలేదని మరో టీచర్ని మందలిస్తుంటే ఆశ్చర్యపోయాను .  పిల్లలమే కాదు టీచర్లు కూడా అతని జులుంకి బలి అయిపోతారని అర్ధమయింది.
జోగినాధం మాస్టారు ఒంటరి మనిషి ,మొదటి  భార్య పోయిన రెండేళ్ళకి మళ్ళీ పెళ్ళి చేసుకున్నారుట.ఆమె ఆర్నెల్లు కూడా బ్రతకలేదుట .అప్పటి నుండి తమ్ముని యింటి పక్కనే చిన్న యిల్లు అద్దెకి తీసుకుని తమ్ముని యింటిలో భోజనం చేస్తూ ఒక్కరే వుండటం అలవాటు చేసుకున్నారు.యితని చండశాసనత్వమ్ పడలేక యిద్దరు భార్యలు యీ లోకం విడిచి పోయారేమోనంటూ  పిల్లలం విమర్శ చేసుకునే వాళ్ళ చాటుగా.
వేసవి వచ్చిందంటే చాలు స్కూల్లో కొత్త కుండలు తెప్పించేవారు. వాటికోసం పిల్లల వద్దనుండే డబ్బులు వసూలు చేసేవారు. వాటిని ప్యూను చేత దగ్గరుండి నింపించి మూతలు పెట్టించేవారు.ఇంటర్వెల్ల్ సమయంలో పిల్లలు నీటిని వౄధా చేయకుండా కుండలు పగలకొట్టకుండా అందరూ నీళ్ళు తాగేలా చూసేవారు.
ఒక రోజు ఒక స్టూడెంట్ చేతిలోంచి గ్లాసు జారిపడి కుండ పగిలి పోయింది. వెంటనే ఆ కుర్రాడి పేరు క్లాసు కనిక్కుని కుండ ఖరీదు చెల్లించమని ఆర్డరు జారీ చేశారు.ఆ పిల్లాడు ఏడుస్తూ తను పేద విద్యార్ధినని, డబ్బులు యిచ్చుకోలేనని గోల పెట్టాడు. వెంటనే ఆ అబ్బాయి క్లాసుకి వెళ్ళి వున్న సంగతి పిల్లలందరికీ చెప్పి అందరూ తలో కాస్త వేసుకుని కుండ కొని యధాస్థానంలో పెట్టమని సలహా యిచ్చారు.పిల్లలందరికీ కోపం వచ్చి,"మేమెందుకు చెల్లించాలి? ఎవరు పగలగొట్టారో వాళ్ళనే చెల్లించమనండి."అంటూ వ్యతిరేకించారు."సరే రేపటినుంచి డ్రమ్ములో నీళ్ళు తాగండి.ఈ మాత్రం సహకారం లేకుంటే జీవితంలో చాలా కష్ఠ పడావలసివస్తుంది ఆలోచించుకోండి."అవి మాటలు కావు శిలా శాసనాలు.
యిలా క్లాసు  టీ చరుగా ఆ సంవత్సరంలో రోజూ తెలిసే విషయాలు యివన్నీ .అయితే స్కూలు చదువు పూర్తయేదాకా ఏదొ ఒక సందర్భలో పిల్లలందరికీ అతనితో భేటీ అవుతూనే వుంటుంది.అన్ని సంవత్సరాలలో అనారోగ్యంతోగాని వూరికి వెళ్ళో శలవు పెట్టడం చూడలేదు.అతన్ని ఎంత విమర్శించుకునీవాళ్ళమో కనిపించకుంటే అంత వెలితిగా భావించేవాళ్ళం.
సంవత్సరం పూర్తయి ఏన్యువల్ పరీక్షల ముందు చాలమంది టీచర్లు స్పెషల్ క్లాసులు పెట్టి కోర్సు పూర్తి చేసేవారు.కాని జోగినాధం మాస్టారు ఫిబ్రవరిమొదటి వారానికి కోర్సు పూరి చేసేసి రివిజన్ మొదలు పెట్టేవారు.మిగతా టీచర్లకి చాలా ఆశ్చర్యం అతను కోర్సు అంత త్వరగా ఎలా పూర్తి చెయ్యగలరా అని.అతని క్లాసులో పిల్లలు కూడా మంచి పర్సెంటుతో   పాసయ్యేవారు. ఒకరో యిద్దరో పరీక్షలో తప్పేవారు.ఒక స్టూడేంటుగా అతనిని పైపైన చూసినప్పుడు కొంత శాతమే అర్ధమవుతారు.
అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో యింటికి వెళ్ళాను.  ఒక్కసారి జోగినాధం మాస్టారిని కలవాలనిపించింది. స్కూలుకి శలవలు ప్రారంభం కాలేదు. స్కూల్లోఅడుగు పెడుతూంటే ఒక అనిర్వచ్నీయమైన ఆనందం కలిగింది.ఇదే స్కూల్లో నా బాల్యం, పెద్ద చదువులకి పునాది ఏర్పడింది దానికై దోహదం కల్పించిన మాస్టాలందరికీ జోహార్లర్పిస్తూ టీచర్స్ రూము ముందు నిలబడ్డాను అనుమతికోసం.
నీడకదలగానే,"ఎవర్రా?"గొంతు జోగినాధం మాస్టారిదే. "నేనే మాస్టారూ సతీష్ ని మీ స్టూడెంటుని,"
"ఓరి! నువ్వా? రా! రా! ఎలా వున్నావ్? ఎక్కడ చదువుతున్నావ్?"యింత ఆప్యాయంగా మాట్లాడటం మాస్టారి స్వభావమే కాదు ఎంతో విచిత్రమనిపించింది. కంగ్రాట్యులేషన్స్ మాస్టారూ! మీకు బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చిందని నా స్నేహితుడు రాశాడు. అది తెలిసి మిమ్మల్ని కలవకుండా వుండలేకపోయాను," అన్నాను వినయంగా.
"నాకు అవార్డ్ రాకపోతే నన్ను కలియవురా? పోనీలే అలాగైనా నన్ను చూడాలనుకునే వాడు ఒకడున్నాడన్న సంతోషంకలిగింది.అన్నట్లు హెడ్మాస్తర్ గారు నా కోసమని చిన్న సన్మానం లాంటిది చేద్దామని టీచర్లని పిల్లలని కూడపెడుతున్నారు.స్కూల్లో ఏ ఫంక్షనయినా ఏర్పాట్లన్నీ నేనే చూసే వాడిని,కాని యిది నాకు సంబంధించినది కావటంతో నేను కాస్త ఎడంగా వుండాల్సి వస్తోంది.  నువ్వు ఓల్డ్ స్టూడెంటువి నీ సహాయం తీసుకుంటారేమో ఒక్క సారి హెడ్మాస్టర్ గారిని కలుసుకో." అంటూ పురమాయించారు.
మంచి సమయంలోనే వచ్చాననిపించిది. మే ఐ కమిన్ సార్!" హెడ్మాస్టర్ గారు తల తిప్పి చూసి ఎవర్న్నట్లు నొసలెగరేశారు.
"నా పేరు సతీష్ సార్! లాస్టియర్ బేచ్ స్టూడెంట్ ని.యిప్పుడు ఇంటరు తెనాలిలొ చదువుతున్నాను.జోగినాధం మాస్టారికి అవార్డ్ వచ్చిందని తెలిసి ఆయన్ని అభినందించుదామని వచ్చాను.మిమ్మల్ని కలవమన్నారు.మీరు మాస్టారికి సన్మానం చేసే ఏర్పాట్లు చేస్తున్నారని మీకు సహాయపడమని చెప్పారు."
"ఓ! రా కూర్చో." ఫరవాలేదు సార్!యీ ఫంక్షన్ పనుల్లో నేనూ సహాయం చేస్తాను, యీ విధంగా మాస్టారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను."
మన గోపాలం మాస్టారి వద్ద వివరాలన్నీ వున్నాయి,తెలుసుకుని నీకు చేతనైన సహాయం చెయ్యి. అవసరమైన దబ్బు అతని వద్దే వుంది సంకోచించకుండా తీసుకో.ఈ సందర్భం మన స్కూలుకే గర్వ కారణం."
"అవును సార్!మరి నేను వస్తాను."
రెండు రోజుల తరువాత శనివారం సాయంత్రం ఆరు గంటలకి సన్మానం. సింపుల్ గా హాలునలంకరించాం. పుష్ప గుచ్ఛాలు పూలమాల ఒక శాలువ తెచ్చాం.పిల్లలు కొంతమంది,టీచర్లు సమావేశమయ్యాం.
ఆ రోజు కూడా ముతక ఖద్దరు దుస్తులు ధరించే వచ్చారు జోగినాధం మాస్టారు. తన ప్రక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టారు హెడ్మాస్టరుగారు .జోగినాధం మాస్టారి మెడలో పూల దండ వేసి శాలువ కప్పి చేతికి పుష్ప గుచ్ఛ మిచ్చారు.
"శ్రీ జోగినాధం మాస్టారు అత్త్యుత్తమ వుపాధ్యాయునిగా పురస్కారం అందుకోవడం మన స్కూలుకే గర్వకారణం.నిగర్వి,నిరాడంబరుడూ, నిజాయితీపరుదు యిన్ని 'ని ' లని తనస్వంతం చేసుకున్న యితను నిస్వార్ధపరుడు కూడా.టీచరంటే యిలాగే వుండాలనిపించేలా అర్ధం చెప్పారు మనందరికీ.
ఈ సందర్భంగా యితన్ని సన్మానించడం మనని మనం సన్మానించుకున్నట్లే. యితని ప్రవర్తన బాహ్యంగా కనిపించినదానిక్ పూర్తిగా భిన్నం.మాట ఎంత కరుకో మనసు అంత వెన్న.
స్కూలు కార్యక్రమాలన్నింటిలోను సహాయపడుతూ ఏవి కొనాలన్నా ఎవరికీ అవకాశం యివ్వకపోతే ,మొదట్లో డబ్బులు మిగుల్చుకునేందుకా అని అపోహ చెందాను. కాని అది ఎంత తప్పో తరువాత తెలిసి వచ్చింది.కొనేటప్పుడు చౌకగా అమ్మేటప్పుడు లాభసాటిగా చేసి ఎంతో కొంత మొత్తం మిగిల్చి పేద విద్యార్ధులకు ధన సహాయం చేసేవారు
పాత పుస్తకాలకు బైండు చేయించి మరుచటి సంవత్సరంలో కొనుక్కోలేని విద్యార్ధులకు యిచ్చేవారు. మన స్కూల్లో అందమైన పూలతోట మాస్టారి అభిరుచే.మనం వృధా చేసే నీటిని వుపయోగించి పూలు పూసేలా చేయించారి.ఈ స్కూల్లో జోగినాధం మాస్టారు చాలా సంవత్సరాలనుంచి పని చేస్తున్నారు.నేను వచ్చిన ఆరు సంవత్సరాలలో ఆరు నెలలు అతనిని అపార్ధం చేసుకున్నాను.నెమ్మదిగా అతని ఆశయాలు ఆలోచనలు గ్రహించాక అతనికి అండగా నిలిచాను.
ఎవరేమనుకుంటారోనన్న జంకు లేదు. ప్రతివారు తన వెనుక విమర్శలు చేస్తున్నారని తెలిసినా లెక్క చేయక అతని ఆశయ సిధ్ధికై ముందడుగు వేస్తున్నారు.తనకంటూ ఎవరూ లేరని బాధపడుతూ కూర్చోక తన జీతంలో కొంత భాగం ఆదా చేస్తూ వచ్చారు.పేద విద్యార్ధులకై వినియోగించాలని అతని ఆశ.ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఆదా చేయగల నేర్పు జోగినాధం మాస్టారికే వుంది.
పై విషయాలన్నీ తెలిశాక జోగినాధం మాస్టారంటే ఏమిటో అందరికీ తెలిసిందనుకుంటాను.ఎవరికీ తెలియని విషయం మరొకతుంది. ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళి తన మరణానంతరం తన అవయవాలు యితరులకు వుపయోగించమని దాన పత్రం రాసి వచ్చారు.(కరతాళ ధ్వనులతో హాలు మారు మ్రోగింది) యీ పురస్కారం దొరకటం జోగినాధం మాస్టారికే కాదు మనందరికీ కూడా గర్వ కారణం ." అంటూ తన ప్రసంగం ముగించారు.
జోగినాధం మాస్టారు యోగిలా అంతా విన్నా చివరలో కనులు చెమర్చి పై కండువాతో తుడుచుకున్నారు. మిగతా టీచర్లు కూడా అంతకు ముందున్నా అభిప్రాయం మార్చుకుని జోగినాధం మాస్టారి సుగుణాలే నాలుగేసి మాటలు చెప్పారు. పిల్లల తరఫున నేను మాస్టారిపై వ్రాసుకొచ్చిన కవిత చదివాను.
జోగినాధం మాస్టారంటే పిల్లలకి హడల్
ముతక ఖద్దరు దుస్తులు
ముక్కు మీదకు జారే కళ్ళజోడులోంచి నిశిత ధృక్కులు
మాటేమో కరకు - పిల్లలకు అది వింటే ఒణుకు
తప్పు చేసినందుకు లేదు బాధ
మాస్టారు చూసి కేకలేస్తారేమోనన్న వ్యధ
యివన్నీ మాస్టారి బాహ్య రూపం
తన మంచితనం కనిపించనీయక గోప్యం
మంచి గంధపు సువాసనని అరికట్టలేనట్లు
మాస్టారి ఆశయాలకు లేవు ఆనకట్టలు
పిల్లలు,వారి విద్యాభ్యాసం వారి లోకం
స్కూలు పరిశుభ్రత వారి ప్రపంచం
మీ వద్ద నుండి దూరమైన తరువాతనే గ్రహించాం
మీ మాటల విలువ ప్రతి క్షణం
మీ వృత్తిలో వున్న అంకిత భావం
పొందింది అత్త్యుత్తమ వుపాధ్యాయ పురస్కారం
విన్న మేమంతా ధన్యులం
జోహారు జోగినాధం మాస్టారూ జోహారు
ఓపికగా విని అంతా అభినందించారు.హెడ్మాస్టరుగారు లేచి యిప్పుడు జోగినాధం మాస్టారు మాట్లాడతారు.
జోగినాధం మాస్టారు లేచి అందరికీ నమస్కరించారు. "నేను చేతలవాడినే గాని మాటలవాడినికాను.నేను ఏదో చేశానని భావించటం లేదు.యింకా ఏమేం గలనా అని ఆలోచిస్తున్నాను.నా ప్రియ శిష్యుడు సతీష్ నాపై తమకున్న అభిప్రాయం ,అభిమానం కవిత రూపంలో తెలియ జేశాడు, చాలా బాగుంది. హెడ్మాస్టరుగారు నా సహోద్యోగులు నాపై చూపిన అభిమానానికి చాలా కృతజ్ఞుడిని.నా దగ్గర వున్నంత వరకు నాశిష్యులు నాపై ఏ అభిప్రాయంతో వున్నా,నాకు తెలుసు యీ స్కూలు వదిలి బయట ప్రపంచంలో అడుగిడితే నా మాటల ప్రభావం పరోక్షంగా పని చేస్తుంది.
నాకు కావలసినది అదే! నా ముందు ముఖస్తుతి నాకొద్దు.యిక హెడ్మాస్టరుగారు చెప్పినట్లు నన్ను అపార్ధం చేసుకుందికే ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తారు.'నీటిని తేరిస్తే గాని పరిశుభ్రత తెలియదు,అలాగే నా ఆలోచల్ని ఆశయాలని తేర్చిచూస్తే గాని అందులో విలువ తెలియదు '.
నా విద్యాభ్యాసానికి ఒక దాత అజ్ఞాతంగా ధన సహాయం చేశారు.నేనూ పేద విద్యార్ధినే.అందుకనే పేదవిద్యార్ధులు ధన సహాయం లేక వంచింప బడకూదదు. అది నా ధృఢ సంకల్పం. నా సహోద్యోగులకు నా విన్నపం నెలలో ఒక రూపాయి అయినా దాచండి.ఎవరికి జీవితాన్ని ప్రసాదించడానికి వుపయోగపడుతుందో. యిక పోతే పారితోషికాలూ పొగడ్తలూ తాత్కాలికం మన ఆదర్శమే మనకి శాశ్వతం కావాలి! యింతకన్నా చెప్పడానికేమీ లేదు.యింత అభిమానంతో నాకు చేసిన యీ సన్మానానికి కృతజ్ఞుడిని.
యిన్ని సంవత్సరాల వుపాధ్యాయ వృత్తిలో వుత్తమ వుపాధ్యాయునిగా ఎన్నికవటం మాటలు కాదు జోగినాధం మాస్టారు చండశాసనుడే కాదు ఆల్ రౌండర్  కూడా."హేట్సాఫ్ మాస్టారూ"  అని మనసులోనే జోహారులర్పించాను.జీవితంలో కొంత భాగం వృత్తికై వినియోగించే వాళ్ళుంటే, జీవితమే వృత్తిగా భావించేవాళ్ళు జోగినాధం  మాస్టారిలాంటివాళ్ళు.

3 comments:

SD said...

బావుందండీ.
అన్నట్లు మీరుండేది భిలాయి లోనా? నందినీ లో ఒకప్పుడు ఉన్న విఠాల కృష్ణమూర్తి గారు తెలుసా మీకు? వాళ్ళబ్బాయి ఇప్పుడు ఫేమిలీ తో పాటు భిలాయిలో ఉంటున్నాడు. మీకు తెలుస్తే మీ ఈమెయిల్ ఐడి ఇవ్వగలరా?
ధన్యవాదములు

Hymavati Devi said...

డిజి గారూ నమస్కారం మీ కామెంటు చూశాను. మేము భిలాయిలో వుండే వాళ్ళం గాని నందినిలో వారితో పరిచయం లేదు 2000 లో భిలాయి వదిలేసి ముంబై వచ్చేశాము.
హైమవతి.

Unknown said...

బాల్యం కళ్ళ ఎదుట ఉంచావు అక్కయ్య.